అమీర్పేట, ఆగస్టు 25: గత జ్ఞాపకాలు ఫొటోల రూపంలో భద్రంగా ఉంటాయని, ఆధునిక యుగంలోనూ ఫొటోగ్రఫీకి ప్రాము ఖ్యం తగ్గలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా ఫొటో జర్నలిస్టులు క్షణకాలంలో బంధించాల్సిన ఘట్టాల కోసం శక్తికి మించి పనిచేస్తున్నారని వెల్లడించారు. వీరికి మరింత గుర్తింపు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలకు అవార్డుల ప్రదానోత్సవం గురువారం హైదరాబాద్లోని గ్రీన్పార్క్ హోటల్లో అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. ఫొటోగ్రఫీ అవార్డుల నగదు ప్రోత్సాహకాలు పెంచటంతో పాటు కన్సోలేషన్గా ప్రతి ఫొటోగ్రాఫర్కు గుర్తింపు దక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 96 మంది ప్రెస్ ఫోటోగ్రాఫర్లు 1,200 ఎంట్రీలు పంపగా, ఆ చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి తలసాని ప్రారంభించారు. సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. వెయ్యి మాటలతో చెప్పే విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పే శక్తి ఫొటోగ్రఫీకే ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ కూర్మాచలం అనిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
ఈ పోటీల్లో నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫ ర్లు 6 అవార్డులు గెల్చుకోగా, తెలంగాణ టుడే ఫొటోగ్రాఫర్ ఒక అవార్డు గెల్చుకొన్నారు. ‘స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్’పై హైదరాబాద్కు చెందిన వీరగోని రజనీకాంత్గౌడ్ తీసిన ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది. వరంగల్కు చెందిన గొట్టె వెంకన్నకు తృతీయ, హైదరాబాద్కు చెందిన రజనీకాంత్గౌడ్, ఎం గోపీకృష్ణ, గడసంతల శ్రీనివాస్, సూర్యాపేటకు చెందిన సైదిరెడ్డి, తెలంగాణ టుడేకు చెందిన సూర్య శ్రీధర్ కన్సోలేషన్ బహుమతులు పొందారు.