హైదరాబాద్, సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ కుమార్తె ప్రియాంక ‘సినీ స్టడీస్, విజువల్ కల్చర్ విభాగంలో జరిపిన పరిశోధనకు గాను ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అంతరించిపోతున్న కళలపై పరిశోధనకు గాను యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది. కథ, సంగీతం, చిత్రణ, సాహిత్యం లాంటి అంశాల్లో ప్రియాంక పరిశోధన పూర్తి చేసి వాటిని డాక్యుమెంటరీగా రూపొందించారు. యక్షగాణం, బుర్రకథ, సురభినాటకాలపై మక్కువతో తాను పరిశోధన కొనసాగించి అందులోని విశేషాలను పొందుపరిచారు. పరిశోధనలో తనను ప్రోత్సహించిన వారందరికీ డాక్టర్ ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఏలె లక్ష్మణ్ కూడా ‘ది కూనపులి విజువల్ అండ్ ఓరల్ ట్రెడిషన్-ఎ స్టడీ ఆఫ్ ది మార్కండేయ పురాణం త్రూ ది నకాషి పెయింటెడ్ స్క్రోల్స్ ఆఫ్ తెలంగాణ’ అంశంపై పరిశోధనకు గాను ఇఫ్లూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు.