సూర్యాపేట టౌన్: అవసాన దశలో ఉన్న వారికి స్వాంతన చికిత్స కేంద్రం సేవలు అందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఇన్ పేషంట్లతో పాటు ఔట్ పేషంట్లు కూడా వైద్య సేవలు అందిస్తారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు ఎంతగానో విస్తరించాయని ఆయన కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుబందంగా ఏర్పాటు చేసిన పాలిటివ్ కేర్ (స్వాంతన) చికిత్స కేంద్రంను ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో అవస్థలు పడుతూ అవసాన దశకు చేరుకున్న వారికి ఈ కేంద్రంలో చికిత్సలు అందిస్తారన్నారు. ఇందులో చేరి చికిత్సలు పొందిన మీదట ఇంటికి వెళ్లిన వారికి కూడా అవసరమైతే హోమ్ కేర్ చికిత్సలు అందిస్తారని ఆయన తెలిపారు. అసంక్రమిత వ్యాదులను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా ప్రాధమిక దశలో క్యాన్సర్ ను గుర్తించే వ్యాధి నివారనకు చర్యలు తీసుకోవడంతో పాటు డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ఇక్కడ చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ కేంద్రంలో చేరిన వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తారని ఆయన చెప్పారు. అధికారుల లెక్కల ప్రకారం 65,365 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 25,335 మందికి స్వాంతన కేంద్రంలో చికిత్సలు అవసరమని తెలియజేశారు. హోమ్ కేర్ చికిత్సల నిర్వహణకుగాను ప్రత్యేక వాహనం, వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికా, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, జడ్పిటీసీ జీడి భిక్షం, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, సూపరెంటెండెంట్ దండ మురళీదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రవాస తెలంగాణ వాసుల సహాయం అనిర్వచనీయమైనవి
అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వాసులు మెడికల్ కళాశాలకు అందిస్తున్న సేవలు అనిర్వచనీయని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అక్కడ ఉండి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫారం కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. సూర్యాపేట లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తున్న విషయాన్ని తెలుసుకున్న అమెరికాలోని తెలంగాణ వాసులు అభివృధ్ధికి ఆర్ధిక సహాయం అందించడాన్ని ఆయన స్వాగతించారు.
అమెరికాలోని టీడీఎఫ్ (తెలంగాణ డెవలప్మెంట్ ఫారం) ఆద్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ పేషంట్ల కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రాన్ని సోమవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐసీయూ కేంద్రానికి కావాల్సిన 10 బెడ్లు, 5 మానిటర్ల, 2 వెంటిలేటర్లతో పాటు 2 సిరంజీ పంపులు, ఐసీయూకు పూర్తి మెటిరియల్ను టీడీఎఫ్ ప్రతినిధులు సమకూర్చారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో సామాన్యుడికి అందుబాటులోకి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందని ప్రభుత్వ వైద్య సేవలు అవసర మున్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు చేయూతనందించేందుకు గానూ ప్రవాస భారతీ యులతో పాటు స్వచ్చంద సంస్థలు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సరస్వతి విధ్యానిలయం 1986 బ్యాచ్కు అభినందన
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో అందిస్తున్న సేవలకు తోడ్పాటునందించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సరస్వతి విద్యా నిలయం 1986 భ్యాచ్ను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసీయూ కేంద్రానికి సూర్యాపేటలోని సరస్వతి విద్యా నిలయం 1986 పూర్వ విద్యార్థులు రూ.3 లక్షల విలువైన కూడిన కర్టెన్లు, 10 ఫ్రిడ్జ్లు బహుకరించారు. ఈ సందర్భంగా వాటిని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గాలి రమేశ్, సురేశ్, అనంతుల కృపాకర్, నర్సింహారావు, తాటి విద్యాసాగర్, తన్నీరు నిర్మల, రాధిక పాల్గొన్నారు.