హనుమకొండ చౌరస్తా, మార్చి 16 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే మీడియా సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటుచేసిన ఆటోషోకు విశేష స్పందన వచ్చింది. రెండురోజులపాటు నిర్వహించే ఆటో షో (కార్లు, బైక్ల ప్రదర్శన)ను శనివారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆటోషోలో మహావీర్ బెంజ్, మహావీర్ స్కోడా, కృష్ణ వోల్వో, ఆడి హైదరాబాద్, ప్రైడ్ జీప్, పీపీఎస్ వోల్క్స్వాగన్, విన్ టీవీఎస్, విన్ మోటార్స్, మోటార్లైన్ మహీంద్ర, మిత్ర సుజికి, కియా మోటార్స్, ఆదర్శ మోటార్స్, ఆదర్శ నెక్సా, గ్రీన్ హోండా, హ్యాపీ ఆటోమోటివ్ యమహా, హేమా హుందాయ్, ప్రైడ్ సిట్రోన్, ఎంజీ మోటార్స్, మహావీర్ జేఎస్యూజెడ్యూ యాజమాన్యాలు తమ లేటెస్ట్ కార్లు, ద్విచక్రవాహనాలను ప్రదర్శనలో పెట్టాయి. ప్రత్యేక స్టాళ్లను వాహన ప్రేమికులు, ప్రజలు సందర్శించారు. కారు, బైక్ మోడళ్ల వివరాలను ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. తమకు నచ్చిన కార్లు, బైక్లను కొనుగోలు చేశారు.
‘నమస్తే’ చొరవ అభినందనీయం: ప్రకాశ్
వాహన ప్రేమికులు అబ్బురపడేలా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే హనుమకొండలో ఆటోఎక్స్పో షో నిర్వహించడం అభినందనీయమని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ చెప్పారు. అనేక దిగ్గజ కంపెనీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఆలోచన గొప్పదని పేర్కొన్నారు. వాహనాల కోసం షోరూంలు తిరగాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు ఇక్కడికి వచ్చి అన్ని స్టాళ్లు సందర్శించి తమకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. టెస్ట్డ్రైవ్ చేసి మరీ కొనే అవకాశం కల్పించినందుకు యాజమాన్యాలను, నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు.
ఒకే వేదికపైకి వివిధ కంపెనీల వాహనాలు: సుధీర్
వాహన ప్రేమికుల అభిరుచులకు అనుగుణంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటోషో ఏర్పాటు అభినందనీయమని జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ పేర్కొన్నారు. బైకులు, కార్లు కొనాలనుకునేవారి అవసరాలను గుర్తించి ఒకే వేదికపైకి వివిధ కంపెనీల వాహనాలు తీసుకురావడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఇలాంటి వేదికలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని, ఒకప్పుడు ఇలాంటి ఆటోషోలు మహానగరాలకే పరిమితయ్యేవని, ఇప్పుడు మన హనుమకొండలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చార చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్య భూమిక పోషిస్తున్న నమస్తే తెలంగాణ.. మరోవైపు ఆటోఎక్స్పో షో వంటి ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రజల సౌకర్యార్థం ఆటోషోలు: సురేందర్రావు
ప్రజల సౌకర్యార్థం అన్ని వాహనాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటోషోలు నిర్వహిస్తున్నట్టు నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్స్ జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్రావు చెప్పారు. గతంలో కూడా ఇలాంటి షోలు ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలకే పెట్టేవారని, ఇప్పుడు మన నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఆటోషోలు నిర్వహించి వాహనప్రియుల కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. ఇక ముందు కూడా మరిన్ని షోలు నిర్వహిస్తామని చెప్పారు. వీటికి అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్, ఏజీఎం ఎం రాజిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి కనపర్తి రమేశ్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, యాడ్ మేనేజర్లు అప్పని సూరయ్య, శ్రీచరణ్ ఆనంద్, సామ సురేందర్రెడ్డి, సర్క్యూలేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్రెడ్డి పాల్గొన్నారు.