మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసినప్పటినుంచి ఆటో నడుస్తలేదు. ఆ మనస్తాపంతోనే చచ్చిపోతున్న.
– ఆడియో రికార్డులో స్వామి
వినాయకనగర్, మార్చి 13: ఇంటర్ చదువుతున్న మల్లికార్జున్.. అమ్మానాన్నలతో హాలీడేస్ ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. పరీక్షలు అయిపోగానే, సెలవుల కోసం ఇంటికొచ్చాడు. ఇంటికి చేరి, తలుపులు తీయగానే.. కండ్ల ముందు రెండు మృతదేహాలు. అమ్మానాన్నలిద్దరిలో చలనం లేదు. అమ్మా..! నాన్నా..! అని పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. నిజామాబాద్లో బుధవారం చోటుచేసుకొన్నదీ ఘటన.
ఉచిత బస్సులతో ఆటో నడవక, కుటుంబాన్ని పోషించుకోలేక, చేసిన అప్పులు కట్టలేక మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు తనతో ఏడడుగులు నడిచిన భార్యనూ చంపేశాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిల్లా కెనాల్ ప్రాంతానికి చెందిన స్వామి (45)కి భార్య దేవలక్ష్మి (40), కుమారుడు మల్లికార్జున్ ఉన్నారు. స్వామి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించటం ఆటోవాలాలపై పెను ప్రభావం చూపింది. ఆ ఎఫెక్ట్ స్వామికి కూడా తగిలింది. మరోవైపు అప్పుల బాధలు చుట్టుముట్టడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. దీంతో బుధవారం ఉదయం తన భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిచ్పల్లి మండలం బీబీపూర్ తండాలోని మాడల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కుమారుడు మల్లికార్జున్ బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి తల్లిదండ్రులు విగతజీవులుగా కనిపించారు. భోరుమని విలపించటంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు.
ఆటో నడువకనే..
బలవన్మరణానికి ముందు ఎందుకు తాను ఈ ఘాతుకానికి పాల్పడుతున్నానో స్వామి తన సెల్ఫోన్లో వాయిస్ రికార్డ్ చేశాడు. రేవంత్రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకురావటంతో ఆటో నడవటం లేదని, దీంతో ఇబ్బందులతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ‘ఆటోలు నడుస్తలేవన్న మనస్తాపంతోనే చచ్చిపోతున్న. రేవంత్రెడ్డి ఇచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణంతోని ఆటో నడుస్తలేదు’ అని తెలిపాడు. కష్టసుఖాల్లో తోడుంటానని నమ్మి వచ్చిన భార్యను ఒంటరిగా వదిలి వెళ్లలేక చంపానని వెల్లడించారు.
తమ కొడుకును బాగా చూసుకోవాలని చెల్లిని కోరాడు. తన కుమారుడు ఎవరి దగ్గర ఉంటానంటే వారి వద్ద ఉంచుకొని పోషించాలని, అందుకు తన ప్లాట్ తీసుకోవాలని సూచించాడు. తమ అంత్యక్రియల కోసం చందాలు వేసుకోవద్దని, తన భార్య నగలు అమ్మి అంతిమ సంస్కారాలు చేయాలని విన్నవించాడు. స్వామి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.