మహదేవపూర్ (మల్హర్), మార్చి 18: ఆర్థిక ఇబ్బందులతో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఇప్పలపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై నరేశ్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాజుల శంకరయ్య (53) ఫైనాన్స్లో ఆటో కొని నడుపుకుంటూనే, మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. కొంతకాలంగా ఆటో సక్రమంగా నడవకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
పంట పెట్టుబడి కోసం సుమారు రూ.లక్ష ఖర్చు చేశాడు. దిగుబడి లేక నష్టం వాటిల్లింది. పంట అప్పులు కట్టలేక, ఆటో నడవక ఫైనాన్స్ కిస్తీలు చెల్లించే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తితో శంకరయ్య ఈ నెల 15వ తేదీ రాత్రి 8 గంటలకు బయటకు వెళ్లి వస్తానని ఆటో తీసుకొని వెళ్లాడు. మండలంలోని నాగులమ్మ- మల్లారం వెళ్లే ప్రధాన రహదారి అటవీమార్గంలో ఆటోను రోడ్డు పక్కన నిలిపి గడ్డిమందు తాగాడు.
కొద్దిసేపటికి వాంతులు కావడంతో కుటుంబసభ్యులకు ఫోన్చేసి సమాచారం అందించగా వెంటనే ఘటన స్థలానికి చేరుకొని భూపాలపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.