హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గీతవృత్తిలో కార్మికుల మరణాలు, ప్రమాదాలను నివారించేందుకు అధికారులు అధ్యయనం చేయాలని, కార్మికులకు సేఫ్టీ యంత్రాలను అందించేందుకు తక్షణమే అధికారులు నివేదికలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లో ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్న క్రమంలో గీత వృత్తి ఆధునీకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. తాటి చెట్టు ఎకే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి వందలాది మంది మృత్యువాత, శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే మెరుగైన, సులభతరమైన సేఫ్టీ యంత్రాలను గీత కార్మికులకు అందించాలని సూచించారు. సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ చంద్రయ్య గౌడ్ పాల్గొన్నారు.