మంచిర్యాల, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో పులి మృత్యువాత మిస్టరీని అధికారులు ఛేదించారు. ఎద్దును చంపిందన్న కోపంతోనే నిందితులు పులిని చంపేసినట్టు గుర్తించారు. ఇందుకు కారణమైన ముగ్గురిని కోర్టులో హాజరు పరిచారు. విషం చల్లిన పశువు కళేబరాన్ని తినడం తోనే పులి చనిపోయిందని విచారణలో నిందితులు అంగీకరించినట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వాంకిడి మండలం వెల్లి పంచాయతీ పరిధిలోని రెంగరీట్ గ్రామానికి చెందిన కోవా గంగు, ఆత్రం జల్పతితోపాటు ఓ బాలుడు(11) విషప్రయోగం చేసిన వారిలో ఉన్నట్టు తెలిపారు. ఆసిఫాబాద్ డీఎఫ్వో నీరజ్కుమార్ టేబ్రీవాల్ శుక్రవారం కాగజ్నగర్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. కాగజ్నగర్ రేంజ్లోని దరిగాం బీట్లో ఈ నెల 8న అనుమానాస్పదరీతిలో మగ పులి మృతిచెందిన ఘటనపై విచారణ చేశామని తెలిపారు. పులిని చంపాలనే ఉద్దేశంతోనే పశు వు కళేబరంపై విషం చల్లామని నిందితులు ఒప్పుకొన్నారని, ఆధారాలను సైతం సేకరించామని చెప్పారు.
నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు. వీరిలో కోవా గంగు, ఆత్రం జలపతికి కోర్టు 12 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిందని, బాలుడిన పేరెంటల్ బాండ్పై రిలీజ్ (అధికారుల విచారణ కోసం ఎప్పుడు పిలిచినా రావాలి, కోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉండాలి) చేసిందని తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతుందని, పూర్తిస్థాయి సమాచారం తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. కాగా, విషం తిన్నట్టు అనుమానిస్తున్న మిగిలిన పులులతోపాటు కనిపించకుండా పోయిన పులుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు మూడు పులుల పాద ముద్రలను గుర్తించామని తెలిపారు. అయితే, ఆ పులుల ఆచూకీ సీసీ కెమెరాల్లోగానీ లైవ్ కెమెరాల్లో గానీ ఎక్కడా రికార్డు కాలేదని వెల్లడించారు. మూడో రోజు సైతం అడవిలో పులుల జాడ కోసం వెతికినట్టు చెప్పారు. 120 మంది సిబ్బందితో కూడిన 24 బృందాలు అడవులను జల్లెడ పట్టినట్టు పేర్కొన్నారు.
ఎద్దును చంపిందన్న కోపంతోనే..
విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పులి తమ ఎద్దును చంపిందన్న కోపంతో నిందితులు విషం పెట్టి పులిని హతమార్చినారని తెలిసింది. ఇటీవల కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో పులుల సంచా రం పెరిగింది. ఈ క్రమంలో తరచుగా పాడిపశువులపై దాడి చేస్తున్నాయి. పలుమార్లు ఫిర్యా దు చేసినా అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదని, అందుకే విషప్రయోగం చేశామని నిందితులు చెప్పినట్టు సమాచారం. పులి పాడిపశువుపై దాడి చేసినా, చంపేసినా అటవీశాఖ నుంచి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, గడిచిన కొన్ని ఘటనల్లో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం తట్టుకోలేక కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. నిర్లక్ష్యంగా వ్యవహరించి పులుల మృతికి కారణమైన అధికారులపై పూర్తిస్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకోకున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. దరిగాం గ్రామంతోపాటు సర్కేపల్లి, రెంగరీట్ గ్రామాలకు చెందిన మొత్తం 8 మందిని అనుమానితులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు తప్పు అంగీకరించగా, మిగిలిన ఐదుగురిని ఇంటికి పంపించినట్టు తెలిసింది.