హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ‘విదేశీ చదువులకు అత్యుత్తమ గమ్యస్థానం ఆస్ట్రేలియా’ అని ఆస్ట్రేలియా డిజిటల్ ఎడ్యుకేషన్ హబ్ డైరెక్టర్ విక్సింగ్ తెలిపారు. 2021 డిసెంబర్ నుంచి 2022జూలై నాటికి 2.60లక్షల స్టూడెంట్ వీసాలను మంజూరు చేశామని చెప్పారు. ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్ హోటల్లో ‘స్టడీ ఆస్ట్రేలియా రోడ్షో’ నిర్వహించింది. ఈ సందర్భంగా విక్సింగ్ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వీసా నిబంధనల మేరకు ఆస్ట్రేలియాలో చదువు పూర్తిచేశాక, అక్కడే కంపెనీలు స్థాపించవచ్చని, స్టార్టప్లుగా రాణించవచ్చని తెలిపారు. విదేశీ విద్యార్థుల తమ కెరీర్ను మలచుకొనేందుకు ‘న్యూ కెరీర్ మ్యాచర్ టూల్’, ఉద్యోగావకాశాల ‘ఎంప్లాయీబిలిటీ’ హబ్లను ఏర్పాటుచేశామని వివరించారు.
పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు రెండేండ్లు పెంపు
కొవిడ్ తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసాల వ్యవధిని ఆస్ట్రేలియా ప్రభుత్వం గరిష్ఠంగా రెండేండ్లకు పొడిగించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో కనీస వేతనం గంటకు 40 డాలర్లకు పెంచారు. ఇది శుభపరిణామం.
మోసపోతే ఫీజులు వాపస్
ఆస్ట్రేలియాలో ఫేక్ వర్సిటీలతో మోసపోవడానికి అవకాశం లేదు.ఒకవే మోసపోయినా, కోర్సులు మూతపడినా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.మరో విద్యాసంస్థలో కోర్సు పూర్తిచేసుకొనేందుకు సహకరిస్తుంది.
ఆసరాగా.. స్కాలర్షిప్స్
2019లో 55దేశాలకు చెందిన 3వేల పైచిలుకు విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం స్కాలర్షిప్స్ అందజేసింది. 300 మిలియన్ డాలర్లను స్కాలర్షిప్స్ కోసం సమకూర్చింది. కోర్సులు, వర్సిటీలను బట్టి 50శాతం, 25శాతం చొప్పున ట్యూషన్ ఫీజులను, స్కాలర్షిప్లను చెల్లిస్తున్నది. డిగ్రీ, పీజీలో ట్యూషన్ ఫీజు లేదా 5 నుంచి 10 వేల డాలర్ల వరకు స్కాలర్షిప్స్ను అందజేస్తున్నది. ఉన్నత విద్యావకాశాల కోసం విద్యార్థులు https://www.studyaustra lia. gov.au/indiaను సంప్రదించాలి.