యాదగిరిగుట్ట, మార్చి 17 : అత్త మృతిని తట్టుకోలేక కోడలు హఠాన్మరణం చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లగుడిసెల్లో ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చుక్కల భారతమ్మ (65) తన తల్లికి గాయాలు కావడంతో పరామర్శించేందుకు శనివారం భువనగిరి మండలం రాయగిరికి వెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న బంధువులు ఆమె మృతదేహాన్ని సొంత ఊరైన గొల్లగుడిసెలకు తీసుకొచ్చారు. చిన్న కోడలు మంగమ్మ (28) అత్త మృతదేహంపై పడి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నది. బంధువులు వెంటనే భువనగిరి దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని ధ్రువీకరించారు. భారతమ్మ భర్త పాపయ్య గత ఏడాది మృతి చెందగా ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు కనకయ్య భార్య మంగమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. వారి రోదనలతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. అత్తాకోడలు అన్యోన్యంగా ఉండేవారని, ఇద్దరూ ఒకేసారి మృతిచెందడం బాధాకరమని స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు.