హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ఆడియో సందేశాన్ని పంపారు. నామినేషన్లు పూర్తికావడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడక్కనున్నదని, ఈ నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలోని పోలీస్ ఉన్నతాధికారులు తప్పనిసరిగా అన్ని పోలీస్ స్టేషన్లను పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికలకు స్థానిక పోలీసులు ఎలా సన్నద్ధంగా ఉన్నారో తెలుసుకొని అవసరమైన చోట సలహాలు, సూచనలు ఇవ్వాలని, సమస్యాత్మక ప్రాంతాలకు స్వయంగా వెళ్లి, అక్కడి ప్రజలతో మమేకం కావాలని స్పష్టం చేశారు.
ఆకస్మిక తనిఖీలు అత్యవసరం
ఎన్నికల వేళ నగదు, మద్యం, ఇతర తాయిలాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ అధికారులు తమ పరిధిలోని చెక్పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. సోదాలపై పోలీసులు, ప్రజలకు సూచనలు ఇవ్వాలని, పట్టుబడిన సొత్తుపై స్థానిక మీడియాలో వార్తలు వచ్చేలా అప్రమత్తం చేయాలని సూచించారు. రాత్రింబవళ్లు ప్రజలతో కలిసి పనిచేసేందుకు ఇదే సరైన సమయమని, వారితో మాట్లాడటం, గైడ్ చేయడం, సలహాలు సూచనలు ఇవ్వడం పోలీసుల దినచర్యగా మారాలని డీజీపీ పేర్కొన్నారు. ఇతర విభాగాల అధికారులలతో ముఖ్యంగా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చే ఇన్పుట్స్ను నిర్లక్ష్యం చేయవద్దని, ఎలాంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవను కేస్స్టడీగా తీసుకోవాలని, ఏకకాలంలో రెండు పార్టీల ప్రచార కార్యక్రమాలు, సమావేశాలు జరిగే చోట మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.