హైదరాబాద్ సిటీబ్యూరో/వనస్థలిపురం, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సస్పెండైన రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కలిసి ఎన్నారైని మోసం చేసిన అంబర్పేట సీఐని వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరోవైపు అరెస్టయిన ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వనస్థలిపురం సీఐ కోల సత్యనారాయణ వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎస్కేడీనగర్లో నివాసముండే కర్ణాటి రాజేశ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పని చేశాడు. నాలుగేండ్ల క్రితం యాచారం మండలంలో పని చేస్తున్న సమయంలో అక్రమాలకు పాల్పడటంతో అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే క్రమంలో ప్రస్తుతం అంబర్పేట్ సీఐగా పని చేస్తున్న పెరం సుధాకర్తో పరిచయం ఏర్పడి, స్నేహితులుగా మారారు. చింతల్కుంటకు చెందిన విజయంత్గౌడ్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. అతనికి రాజేశ్తో పరిచయం ఏర్పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కందుకూరులో సర్వే నంబర్ 54/2లోని 10 ఎకరాల వ్యవసాయ స్థలం తమకు తెలిసిన వాళ్లదని, దాని విలువ రూ.4.50 కోట్లు ఉంటుందని విజయంత్ను నమ్మించాడు. ఆ స్థలానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు. వారి మాటలు నమ్మి, నిరుడు ఫిబ్రవరి నెలలో ఆ పొలాన్ని కొనేందుకు విజయంత్గౌడ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అడ్వాన్స్గా నగదు రూ.5 లక్షలు ఇచ్చాడు. మరో రూ. 50 లక్షలు ఆన్లైన్లో రాజేశ్ ఖాతాకు పంపించాడు. కాగా, ఈ ల్యాండ్కు సంబంధించిన విషయంలో విజయంత్తో రాజేశ్, సీఐ సుధాకర్ కూడా చర్చలు జరిపాడు.
సీఐ ఖాతాకు డబ్బులు బదిలీ
రాజేశ్ బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బును సుధాకర్ ఇంటిపై ఉన్న లోన్ ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకోవాలని అడుగుతూ ఉండటంతో రాజేశ్ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చి ఆ పొలం గురించి , విజయంత్గౌడ్ ఆరా తీశాడు. అయితే ఆ పొలం క్రిస్టియన్ సంస్థ పేరు మీద ఉన్నట్టు తెలుసుకొని మోసం జరిగిందని గుర్తించాడు. తన డబ్బులు ఇవ్వాలంటూ రాజేశ్, సీఐ సుధాకర్పై ఒత్తిడి తెచ్చాడు. తనకు వచ్చిన డబ్బులతో సుధాకర్ ఇంటిని కొన్నానని, దానిని అమ్మి డబ్బులిస్తానంటూ రాజేశ్ చెబుతూ వచ్చాడు. దీంతో బాధితుడు సీఐని కలిసి తన బాధ చెప్పుకున్నాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో జరిగిన మోసంపై విజయంత్ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేశ్ పరారీలో ఉండటంతో సీఐ సుధాకర్ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిం చారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలిసింది. కాగా, రాజేశ్ క్యాసినో ఆడుతూ ఇలా మోసాలు చేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన రెండు వేర్వేరు కేసులు వనస్థలిపురంలో గతంలో అతనిపై నమోదయ్యాయని పోలీసులు వివరించారు. ఫోర్జరీ, చీటింగ్ కేసులపై వనస్థలిపురం పోలీసులు అంబర్పేట్ సీఐ సుధాకర్ను అరెస్ట్ చేయడంతో వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు అతనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏసీబీకి చిక్కిన బహదూర్పుర ఎస్సై శ్రావణ్
బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన బహదూర్పుర ఎస్సై శ్రావణ్ను ఏబీసీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారి ఫయాజ్ వివరాల ప్రకారం.. బహదూర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే ఓ వ్యక్తి ఫైనాన్స్లో బైక్ తీసుకొని, కొన్ని నెలల తర్వాత డబ్బులు చెల్లించలేదు. ఫైనాన్స్ నిర్వాహకులు వాహనాన్ని సీజ్ చేసి, ఎస్సై శ్రావణ్కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా బాధితుడి సెల్ఫోన్ను ఎస్సై స్వాధీనం చేసుకున్నాడు. ఫైనాన్స్ క్లియర్ చేసిన బాధితుడు బైక్ను తీసుకున్నాడు. సెల్ఫోన్ కోసం వెళ్తే ఎస్సై శ్రావణ్ రూ.20 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.8 వేలు చెల్లిస్తానని పథకం ప్రకారం ఒప్పందం చేసుకొని శుక్రవారం ఎస్సైకి ఇచ్చాడు. మాటువేసిన ఏసీబీ అధికారులు శ్రావణ్ వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకొని, ఎస్సైని అదుపులోకి తీసుకొని ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.