కారేపల్లి, డిసెంబర్ 25: భూతగాదాలతో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకొని గాయపర్చుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్నది. అదే మండలం పేరుపల్లికి చెందిన కేలోతు శ్రీనివాస్, పోలంపల్లికి చెందిన బోడ అశోక్ కుటుంబాల మధ్య కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో ఇరువర్గాల వారు ఫిర్యాదు చేసుకోవడానికి పోలీస్స్టేషన్కు వస్తుండగా.. ఆ సమీపంలోకి రాగానే ఘర్షణకు దిగారు. పోలంపల్లికి చెందిన అశోక్, మరొకరు కలిసి కేలోతు హేమ్లా, బుగ్గ సతీశ్లపై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో హేమ్లా పొట్టలో కత్తి దిగింది. తలకూ తీవ్రగాయమైంది. సతీశ్ కాలి తొడకు గాయమైంది. స్థానికుల సహాయంతో 108 వాహనంలో పోలీసులు గాయపడిన వారిని ఖమ్మం దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై పుష్పాల రామారావు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.