ధర్మారం, మార్చి 19: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. తాజాగా.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల ప్రధాన కార్యదర్శి, ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్వీ కోఆర్డినేటర్ సల్వాజీ మాధవరావుపై దాడి చేశారు. ఎస్సారెస్పీ కెనాల్ నీరు రాక ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాధవరావు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కార్యకర్తలు సోగాల తిరుపతి, సోగాల వంశీ, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి.. సోమవారం రాత్రి మాధవరావు ధర్మారంలో ఓ ప్రింటింగ్ ప్రెస్లో పని ముగించుకుని వెళ్తుండగా దాడి చేశారు. ఈ విషయమై మాధవరావు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై టీ సత్యనారాయణ తెలిపారు. కాగా.. మాధవరావు తనను ఎస్సీ కులం పేరిట దూషించారని సోగాల తిరుపతి ఫిర్యాదు చేశాడు. దీంతో అదే రాత్రి మాధవరావుపై అట్రాసిటి కౌంటర్ కేసు నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు. సల్వాజీ మాధవరావుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రోద్బలంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ విమర్శించారు. మాధరావుపై దాడి చేయడమే కాకుండా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కౌంటర్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, మాధరావుకు న్యాయం జరగాలని కోరుతూ ధర్మారంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.