BJP | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ పాలన అంటూ చంకలు గుద్దుకుంటున్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చిన్నారులపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. గత మార్చిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రా లోక్సభ సాక్షిగా సభ్యులకు ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిన్నారులపై జరుగుతున్న నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్సీఆర్బీ) రూపొందించిన నివేదికను జతచేస్తూ ఆయన ఈ సమాధానమిచ్చారు. దీని ప్రకారం చిన్నారులపై అత్యధిక అకృత్యాలు జరుగుతున్న రాష్ర్టాల జాబితాలో బీజేపీ పాలిత రాష్ర్టాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలువగా.. అసోం, కర్ణాటక 8, 9 స్థానాలను దక్కించుకున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ అజయ్కుమార్ మిశ్రా స్వరాష్ట్రం కావడం గమనార్హం.
ఈ 5 బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ర్టాల్లోనూ చిన్నారులకు రక్షణ కరువైంది. చిన్నపిల్లలపై హింస, లైంగిక దాడులు, శారీరక వేధింపులు, కిడ్నాప్లు తదితర నేరాలకు ఈ రాష్ర్టాలు నెలవుగా మారాయి. అయినా ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని గొప్పలు చెప్తున్న నరేంద్రమోదీ సర్కారు.. చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలను ఏమాత్రం అరికట్టలేకపోతున్నది. ప్రత్యేకించి ఇలాంటి నేరాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే అత్యధికంగా జరుగుతుండటం విస్మయానికి గురిచేస్తున్నది. టాప్-10 రాష్ర్టాల్లో ఏటా సగటున 6 వేల నుంచి 19 వేల వరకు కేసులు నమోదవుతున్నాయంటే చిన్నారుల జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
పిల్లలపై అకృత్యాలకు పాల్పడుతున్న నేరగాళ్లకు శిక్షలు విధించడంలో తెలంగాణ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ను ఎన్నడో వెనక్కి నెట్టేసింది. చిన్నారులపై నేరాలకు సంబంధించి గుజరాత్లో 2019-21 మధ్య ఏటా సగటున 4,500కుపైగా కేసులు నమోదవగా.. వాటిలో శిక్షల శాతం చాలా స్వల్పంగా ఉన్నది. 2019లో అక్కడ 4,685 కేసులు నమోదవగా.. 138 కేసుల్లో మాత్రమే నేరస్థులకు శిక్షలు పడ్డాయి. అలాగే 2020లో 4,075 కేసులకు కేవలం 34 కేసుల్లో.. 2021లో 4,515 కేసులకు 107 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ, తెలంగాణలో 2019లో 4,212 కేసులకు 264 కేసుల్లో.. 2020లో 4,200 కేసులకు 470 కేసుల్లో.. 2021లో 5,667 కేసులకు 674 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి.