ఆదిలాబాద్/హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ రిమ్స్ హాస్టల్లోకి బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు చొరబడి పలువురు వైద్యవిద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. రిమ్స్ అసిస్టెంబ్ ప్రొఫెసర్ క్రాంతికుమార్తోపాటు బీజేపీ కార్యకర్త శివ, మరో యువకుడు వసీం కారులో అక్రమంగా వసతిగృహం ప్రాంగణంలోకి ప్రవేశించారు. కవిరాజ్ అనే మెడికో గురించి అడిగి.. ఆయనను పిలిపించి దాడి చేశారు. వారిని అడ్డుకోబోయిన మరికొందరు విద్యార్థులను కొట్టారు. తాము రిమ్స్ డైరెక్టర్ ఫ్యాన్స్ అని, డైరెక్టర్ను సమస్యలపై ప్రశ్నిస్తారా? అంటూ దుండగులు తమను కొట్టారని మెడికోలు తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ రిమ్స్ మెడికోలు గురువారం ఉదయం విధులు, తరగతులు బహిష్కరించి రిమ్స్ కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ.. దవాఖానలో వార్డులు సరిగా లేవని డైరెక్టర్ను ఓ విద్యార్థి అడిగారని, రిమ్స్ డైరెక్టర్ సూచనల మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్, కొంతమంది దుండగులు తమపై దాడి చేశారని వివరించారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ కలెక్టరేట్కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. నిందితులను శిక్షించాలని, రిమ్స్ డైరెక్టర్ను సస్పెండ్ చేయాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్ను విధుల నుంచి తొలగించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గాయపడిన మెడికో విద్యార్థి కవిరాజ్ ఫిర్యాదు మేరకు రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్, వసీం, శివ, ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.
ఇందులో శివ బీజేపీ కార్యకర్త. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు అభినందనలు తెలుపుతూ ఇటీవల శివ పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా.. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన మెడికోల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఇతర నాయకులు మద్దతు తెలిపారు. మెడికోలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. మెడికోలపై దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై విచారణ జరిపేందుకు నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ వీవీ రావుతో కూడిన కమిటీని నియమిస్తూ డీఎంఈ రమేశ్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై సమగ్రంగా విచారించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచిస్తూ సమగ్ర నివేదిక రూపొందించి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.