TSPSC | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్తోపాటు సిస్టం అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డి.. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రాన్ని ఇతరులకు ఇచ్చినట్టు తేలడంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేయాలని యోచిస్తున్నది. మంగళవారం కమిషన్ అత్యవసరంగా సమావేశమై చైర్మన్ జనార్దన్రెడ్డితోపాటు సభ్యులు చర్చించి, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. 833 ఉద్యోగాలకు గత ఏడాది సెప్టెంబర్ 12న నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నెల 5న జరిగిన పరీక్షకు 55,189 మంది హాజరయ్యారు. 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్టు కమిషన్ శనివారమే ప్రకటించింది. అభ్యర్థులకు సమాచారం అందించింది. ఆఫీసులో సిస్టమ్ను ఎవరో ఓపెన్ చేశారనే సమాచారం వచ్చిన వెంటనే పోలీస్స్టేషన్లో కమిషన్ ఫిర్యాదు చేసింది. మరుసటిరోజే జరగాల్సిన పరీక్షతోపాటు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను సైతం ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రద్దు చేసిన పరీక్షలను ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నది. మంగళవారం జరిగే భేటీలో తదుపరి తేదీలను ఖరారు చేసి.. తేదీల ప్రకటనపై నిర్ణయానికి రానున్నారు.
ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించబోయి ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితాలను రిస్కుల్లో పడేసుకున్నారు. టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్డీఏలో టెక్నికల్ అసిస్టెంట్ ఢాక్య, కానిస్టేబుల్ శ్రీనివాస్ను రిమాండ్కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై నేడో, రేపో అధికారికంగా చర్యలు తీసుకోనున్నారు.