హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేర్చాలని అసెంబ్లీ తీర్మానించింది. సీఎం కేసీర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వాల్మీకి బోయ, బేడర్, కిరాతక, నిషాద్, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు, కాయితి లంబాడాలు, భాట్ మధురాలు, చమర్ మధురాలను ఎస్టీలుగా గుర్తించాలన్న ఎస్టీ విచారణ సంఘం 2016లో ఇచ్చిన సిఫారసులను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఆ ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందనా రాలేదు. అందుకే ఈ సామాజిక వర్గాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నివసిస్తున్న మాలి సామాజికవర్గం అనేక ఏండ్లుగా తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నది. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నద’ని సీఎం కేసీఆర్ శాసనసభలో తీర్మానాన్ని చదివి వినిపించారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.