హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం శాసనసభలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా..సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ కేంద్రానికి పంపించాలని కోరింది. మంత్రి జగదీశ్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానంలో..‘ కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు దేశ పురోగతికి, రైతుల ప్రయోజనాలకు, పేదలు, విద్యుత్తు రంగ ఉద్యోగుల మేలుకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులను కాలరాసేలా బిల్లు రూపకల్పన జరిగింది. విద్యుత్తు రంగంలో ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యానికి దారితీసేలా ఉన్నది. ఏడు దశాబ్దాలకు పైబడి ఎంతో శ్రమించి, నిర్మించుకున్న ప్రజా ఆస్తులు, విద్యుత్తు రంగ మౌలిక వసతులు ప్రైవేట్కు ధారాదత్తం చేసే అవకాశం కల్పిస్తున్నది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. కొందరు మూర్ఖులు తెలివి తక్కువగా మీటర్లు పెడుతామని బిల్లులో ఎక్కడా లేదని చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈ బిల్లు వల్ల రాష్ట్రంలో 90 లక్షల మంది ఇబ్బందులు పడుతారని చెప్పారు.