TS Assembly | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలు చర్చించి ఆమోదించనున్నారు. 10వ తేదీ శనివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
శాసన సభ, శాసన మండలి సమావేశాలు సజావుగా సాగేందుకు ముందస్తుగా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు బుధవారం సమీక్షించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వాలని, ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి సమావేశాలు సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు తప్పకుండా ఆఫీసర్ బాక్స్లో ఉండేలా చూడాలని కోరారు. సీఎం సూచన మేరకు పాత అసెంబ్లీ భవనంలోకి శాసన మండలిని మార్చాలని నిర్ణయించామని చెప్పారు. సమావేశాలు జరిగే సమయంలో ధర్నాలు, ర్యాలీలు జరిగే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు అందుబాటులో ఉండేలా చూడాలని, అసెంబ్లీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
శాసనసభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలిచ్చేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు సూచించారు. ఈ సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టులవారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ను కోరారు. ప్రొటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని స్పష్టంచేశారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజులు ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విప్లు అడ్లూరి లక్ష్మణ్కుమార్, బీర్ల ఐలయ్య, లెజిస్లేచర్ అడ్వైజరీ ప్రసన్నకుమార్, డీజీపీ రవిగుప్తా, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఇతర ఉన్నతాఅధికారులు పాల్గొన్నారు.