హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రాజకీయ జోకర్ అని, ఆయన మాటలు, డిమాండ్లు విని ప్రజలు నవ్వుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు కోసం సంచులు, దబ్బనానికి కూడా కేంద్రమే నిధులు ఇస్తుందంటూ గొప్పలు చెప్పిన బండి సంజయ్.. ఇప్పుడు ధాన్యం డబ్బులు చెల్లించాలంటూ సీఎం కేసీఆర్కు ఏ ముఖం పెట్టుకొని లేఖ రాశాడని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు బండి లేఖ రాయడం.. హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. యాసంగిలో వరి సాగు చేస్తే ధాన్యం మొత్తం కేంద్రంతో కొనిపిస్తానంటూ రైతులను రెచ్చగొట్టి పారిపోయిన వ్యక్తి బండి సంజయ్ అని దెప్పిపొడిచారు.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యం కొనుగోలు చేశాక.. డబ్బులివ్వాలని సీఎం కేసీఆర్కు లేఖలు రాస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్కి ఉన్నదా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో కూర్చొని ప్రెస్నోట్లు విడుదల చేసే బండి సంజయ్.. పత్రికలు చదివితే వ్యవసాయ మంత్రి ఎకడున్నారు? వ్యవసాయశాఖ ఏమి చేస్తున్నదో తెలుస్తుందని చెప్పారు. ప్రెస్నోట్లు, ప్రెస్మీట్లు మినహా బీజేపీ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుంచి ఒక రూపాయి అయినా రాష్ట్రానికి తీసుకొచ్చారా? కనీసం వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసమైనా తెచ్చారా ? అని నిలదీశారు.
తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకపోగా, పరిమితికి లోబడి రుణాలు తీసుకొనే అవకాశాలను అడ్డుకొంటుంటే రాష్ట్ర బీజేపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి యాసంగిలో రూ.9,772.54 కోట్ల విలువైన 49.92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. ఇప్పటికే రూ.7,464.18 కోట్లు చెల్లించడం పూర్తయిందని, మిగిలిన చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు. బండి సంజయ్ లాంటి వారి నుంచి చెప్పించుకొనే దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదని స్పష్టంచేశారు.
వానకాలం సాగుపై మంత్రి నిరంజన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 15 లక్షల ఎకరాల్లో కంది పంట సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సుమారు 20 లక్షల ఎకరాల్లో పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయాలని సూచించారు. నకిలీ మిరపనారు ఎవరు అమ్మినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, నాణ్యతపై తెలంగాణలో రెండురోజుల పాటు శిక్షణ పొందిన అస్సాంకు చెందిన 20 మంది రైతుల బృందం బుధవారం మంత్రి నిరంజన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, ఎండీ కేశవులుతోనూ భేటీ అయ్యారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పట్ల అస్సాం రైతులు సంతోషం వ్యక్తంచేశారు.