హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఒకాయనేమో ఉద్యోగాలమ్ముకొంటడు.. ఇంకొకాయన హయాంలో బయటకొచ్చిన అవినీతి కేసులో సాక్ష్యులందరూ అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. మరొకాయనపై స్వయంగా అవినీతి ముద్రవేసిన పార్టీయే.. క్లీన్చిట్ ఇచ్చి.. ముఖ్యమంత్రిని చేస్తుంది. ఇదీ ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం రాజకీయం. అవినీతిలో పీకలదాక మునిగిన నేతలను బీజేపీ నాయకత్వం ఏరికోరి తెలంగాణపై దండయాత్రకు పంపిస్తున్నది. వచ్చినవాళ్లేమో తామంతా సుద్దపూసలని.. తమవంటివారు ఈ ప్రపంచంలో మరెక్కడా లేరన్నంత లెవల్లో నీతి, అవినీతి అంటూ చిలుక పలుకులు పలుకుతున్నారు. చెప్పేవాడికి వినేవాడు లోకువన్నట్టు వీరు తెలంగాణ సర్కార్పై, ముఖ్యమంత్రి కేసీఆర్పై అడ్డం, పొడువు విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి తెలంగాణ ఎల్లలు కూడా తెలియవు, ఇక్కడి భాష కూడా రాదు. ఇక్కడి లోకల్ నేతలు ఏ స్క్రిప్టు రాసిస్తే.. ఆ స్క్రిప్టును పొల్లు పోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుల్లా వల్లెవేసి వెళ్తున్నారు. వీరి నాయకుడు, ప్రధాని మోదీ భద్రతకే దిక్కు దివాణం లేదని దేశమంతా గగ్గోలు పెడుతుంటే. వీరేమో తెలంగాణకు వరుసకట్టి.. గాయి, గాయి గత్తర, బిత్తర చేసి వెళ్తున్నారు. ఈ ఉల్టాపల్టా గాళ్ల బండారం రాస్తే రామాయణం.. వింటే భారతమంత ఉంటుంది. వీరి ఘనత వహించిన లంబకోణాలు, కుంభకోణాల చరిత్ర చూస్తే కండ్లు తిరిగిపోతాయి. మధ్యప్రదేశ్లో వ్యాపమ్, ఉద్యోగాల భర్తీ కుంభకోణాల్లో నిండా మునిగిన దొడ్డిదారి సీఎం శివరాజ్సింగ్ చౌహాన్.. తెలంగాణ సర్కారుపై అవాకులు చవాకులు పేలింది చాలదన్నట్టు.. మరో అవినీతి అగ్రేసరుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను వరంగల్లుకు పంపిస్తున్నది. ‘అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్న చందంగా అవినీతిలో శివరాజ్సింగ్ చౌహాన్కంటే హిమంత బిశ్వశర్మ నాలుగాకులు ఎక్కువే చదివారు.
హిమంత ఘనత వహించిన అవినీతి చరిత్ర ఎంత గొప్పదంటే ఇప్పుడు ఆయన్ను ముఖ్యమంత్రిని చేసిన బీజేపీ.. అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న హయాంలో 2014 ఎన్నికల్లో ఈయనగారి అవినీతి చిట్టాపై బుక్లెట్ విడుదలచేసింది. అస్సాంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న తరుణ్ గొగోయ్ మంత్రివర్గంలో హిమంతబిశ్వ పట్టణాభివృద్ధి మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో లెక్కలేనన్ని కుంభకోణాల్లో పీకల దాకా చిక్కుకొన్నారు. వీటిలో శారద చిట్ఫండ్స్ స్కాం దేశీయమైతే.. లూయిస్ బర్గర్ కుంభకోణం అంతర్జాతీయ స్కాం. తరుణ్ గొగోయ్, హిమంతకు వాటాల్లో తేడాలు రావడంతో సీఎం గొగోయ్ స్వయంగా సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ స్కాంలో పెద్దల హస్తం ఉండటం వల్లనే సీఐడీ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని అస్సాం హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో తన మెడకు కాంగ్రెస్ సర్కార్ ఉచ్చు బిగించడంతో, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండని సీబీఐ కేసు నుంచి తప్పించుకొనేందుకు హిమంత బీజేపీలో చేరారు. హిమంతపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు డిమాండ్చేసిన బీజేపీ.. రాజకీయ లబ్ధికోసం ఆయనకు కాషాయ తివాచీ పరచి మరీ పార్టీలోకి ఆహ్వానించింది.. ఇదే విషయాన్ని అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను మీడియా ప్రశ్నిస్తే, తానేమీ బిశ్వకు క్లీన్చిట్ ఇవ్వలేదని నీతులు చెప్పారు.
హిమంత అవినీతికి ఖండాంతర చరిత్ర ఉన్నది. అస్సాంలో 2010లో గువాహటి మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన మంచినీటి ప్రాజెక్టును న్యూజెర్సీకి చెందిన లూయీస్ బర్గర్ అనే సంస్థ దక్కించుకొన్నది. ఈ ప్రాజెక్టు విలువ రూ.1,452 కోట్లు కాగా, దీనిని లూయీస్ బర్గర్కు దక్కడానికి హిమంత బిశ్వకు రూ.6 కోట్ల లంచం ఇవ్వాల్సి వచ్చిందని సదరు సంస్థే వెల్లడించింది. ఆ దేశ కోర్టులో దాఖలైన చార్జిషీటులో కూడా అస్సాంలో సంబంధిత మంత్రికి లంచం ఇచ్చినట్టు పేర్కొన్నది. ఇదీ హిమంత బిశ్వ అవినీతి చిట్టాలో ఒక పేజీ మాత్రమే. ఇలాంటి అవినీతి ఘన చరిత్రలో ఆరితేరిన నాయకులనే బీజేపీ సీఎంలను చేస్తుంది. వారినిప్పుడు నీతులు చెప్పడానికి తెలంగాణపైకి పంపిస్తున్నది.