హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): సమీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు సంస్థలకు సూచించారు. బయో ఏషియా సదస్సులో భాగంగా సమీకృత ఆరోగ్య సంరక్షణపై శనివారం హెచ్ఐసీసీలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈవై సంస్థ నేషనల్ లైఫ్ సైన్సెస్ లీడర్ సురేశ్ సుబ్రమణియన్ అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ చర్చలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎండియా పార్టనర్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ బైరపనేని, జర్మనీకి చెందిన ఎండోసేన్ ఫార్మాస్యూటికల్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మాక్స్ నార్, నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫ్ ఇండియా డిజిటల్ స్పెషలిస్టు, సీడ్స్ ఇండియా బోర్డు సభ్యురాలు సమితా దాస్, హెల్త్ వర్క్స్ డీఎక్స్ అడ్వైజరీ బోర్డు మెంబర్ డాక్టర్ మకరంద్ జవాడ్కర్, నాస్కామ్ ఎక్సలెన్స్ సెంటర్ సీఈవో సంజీవ్ మల్హోత్రా పాల్గొన్నారు.