హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సువిశాలమైన 12.2 ఎకరాల స్థలంలో, రూ.2,251 కోట్లతో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ కార్యాలయం సర్వహంగులతో ముస్తాబైంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆగ్నేసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ మరికొద్ది రోజుల్లోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సాక్షాత్కరించబోతున్నది. ఒకేసారి 54 కౌంటర్లలో వీసాలను ప్రాసెసింగ్ చేసేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. చూడముచ్చటేస్తున్న ఈ కాన్సులేట్ కార్యాలయం నూత న భవనానికి సంబంధించిన ఫోటోలను యూ ఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకొన్నారు. 2023 ప్రథమార్థంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు.
2008కి ముందు హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ లేదు. అమెరికా వెళ్లాలనుకొనేవారు వీసా దరఖాస్తు, ఇంటర్వ్యూల కోసం చైన్నె వెళ్లాల్సి వచ్చేది. 2008 అక్టోబర్ 24న అమెరికా కాన్సులేట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ , ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నది. నూతన కార్యాలయం అందుబాటులోకి వచ్చాక.. వీసా అపాయింట్మెంట్ల సంఖ్య, ఇంటర్వ్యూ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. దరఖాస్తుల పరిశీలనలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కేంద్రంగానూ ఈ కార్యాలయం నిలువనున్నది.
భారత్-అమెరికా ద్వైపాక్షిక బంధం బలమైనది
యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్
భారత్-అమెరికా ద్వైపాక్షిక బంధం బలమైనదని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో ఆలిండియా సెంట్రల్ సివిల్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ అధికారుల శిక్షణలో భాగంగా మంగళవారం ‘ది ఫారిన్ పాలసీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా’ అన్న అంశంపై జెన్నీఫర్ లార్సన్ ప్రసంగించారు.