వనపర్తి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అసలు క్యాడరే లేదు.. పార్టీలో ఉన్నోళ్లూ పట్టించుకోలేదు.. ఇక ఎందుకు పార్టీలో ఉండటం అని అస్త్రసన్యాసం చేశాడో బీజేపీ నేత. పార్టీకి గుడ్బై చెప్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి రాజీనామా లేఖ రాశాడు. ఆర్టీసీ యూనియన్లో కార్మిక నేతగా పనిచేసిన అశ్వత్థామరెడ్డి కొంత కాలం కిందట బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయనకు పార్టీ అధిష్ఠానం వనపర్తి అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ నుంచి ప్రకటన రాగానే వనపర్తికి చేరుకున్న ఆయన.. స్థానిక బీజేపీ నేతలను కలిసి గెలుపునకు సహకరించాలని కోరారు. వారం పాటు అక్కడే ఉండి ముఖ్య నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకొనేందుకు ప్రయత్నించారు. క్షేత్రస్థాయిలో బీజేపీపట్ల సానుకూలత లేకపోవటంతో పాటు స్థానిక నాయకులెవరూ సహకరించలేదు. బీజేపీ క్యాడర్ మొత్తం ఎడముఖం.. పెడముఖంగా ఉండటం, ఎవరూ పట్టించుకోకపోవటంతో నిరాశకు లోనయ్యారు. కొన్నిరోజుల పాటు వేచిచూసినా ఫలితం లేకపోవటంతో, ఇక తనతో కాదనుకొని చేతులెత్తేశారు. అదే సమయంలో బీజేపీ అధిష్ఠానం ఆయనకు బీఫాం కూడా ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన అశ్వత్థామ రెడ్డి.. బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. బీజేపీ పార్టీని నమ్ముకొని వచ్చినందుకు జరిగిన పరిణామాలతో పార్టీకి రాజీనామా చేశారని వనపర్తి పట్టణంలో ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.