KCR | దమ్ముంటే చేయగలిగిందే చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. రైతుబంధు ఇస్తానని ఎన్నికలప్పుడు చెప్లేదని.. కానీ రైతులకు కావాలని తర్వాత చేశామని చెప్పారు. వడ్లు తడిసిపోయినా కొన్నామని.. రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చామని చెప్పారు. కానీ ఇవాళ దాన్ని కూడా ఊడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదెకరాలు దాటినోళ్లకు రైతుబంధు ఇవ్వనని రేవంత్ రెడ్డి అంటున్నారని.. ఆరెకరాలు, ఏడెకరాలు ఉన్నోడు ఏం పాపం చేసిండ్రు అని ప్రశ్నించారు. పొలం దున్నినోళ్లకే రైతుబంధు ఇస్తారంట.. వాళ్లను ఎట్ల గుర్తుపడతావని అడిగారు. రైతుబంధు కావాలంటే మళ్లీ అధికారుల దగ్గరకు పోవాలి.. దున్నినట్టు సర్టిఫికెట్ అడగాలి.. దాని కోసం లంచం ఇవ్వాలి.. అంటే రైతుబందు మొత్తం గోల్మాల్ చేసే కుట్రకు ప్రభుత్వం తెరలేపుతుందని మండిపడ్డారు.
‘ యాదవుల కోసం గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ పెట్టినం.. అప్పుడు కాంగ్రెస్ నేతలు మమ్మల్ని ఎగతాళి చేసిండ్రు.. కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది? మత్య్సకారులకు ఎంత మేలు జరిగింది? మేం గొల్ల, యాదవ సోదరులకు రెండు లక్షలు ఇస్తామని చెప్పి గొర్రెల పంపిణీ బంద్ చేసిండ్రు. తక్షణమే డీఏ ఇస్తామని ఉద్యోగులకు చెప్పారు.. నాలుగో డీఏ వచ్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. ఇటు ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను, యాదవులను, మత్స్యకారులను, దళిత వర్గాల ప్రజలను అందర్నీ మోసం చేసిండ్రు. విద్యార్థులకు గత 5 నెలల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. 20 లక్షల విదేశీ విద్య నిధి పెడితే స్కాలర్షిప్లు ఆపేసిండ్రు. పూర్తి నిష్క్రియపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది’ అని కేసీఆర్ అన్నారు. పైగా రాహుల్గాంధీ వచ్చి ప్రతి మహిళకు రూ.2500 ఇస్తున్నామని చెబుతున్నారు. రాహుల్ గాంధీ మాత్రమే కాదు.. కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా కూడా ఇదే చెబుతుంది. నారీ శక్తి మీటింగ్ పెట్టి రూ.2500 ఇస్తున్నామని చెబుతుందని తెలిపారు. ఇప్పటికీ మహిళలకు ఒక్క రూపాయి రాలేదు.. వచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు.
ఎన్నికల ముందు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పారని కేసీఆర్ గుర్తు చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేయలేదు కానీ మద్యం అమ్మకాలు మాత్రం పెరిగాయని అన్నారు. ముస్లిం మైనార్టీలను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. కాబట్టి మంచివాళ్లకు ఓటేస్తే మంచి జరుగుతుంది.. మంచి పార్టీ గెలిస్తే మంచి జరగుతుందని విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు. ఉద్యమ కార్యకర్త వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. తన దగ్గర ఉన్న సర్వేల ప్రకారం వినోద్కుమార్ ఇప్పటికే 8 శాతం ముందంజలో ఉన్నారని చెప్పారు. వినోద్కుమార్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని చెప్పారు. ఈ నెల 13వ తేదీ వరకు ఇదే ఆవేశంతో ఉండి.. వినోద్కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.