హైదరాబాద్ జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయంలో శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా గృహనిర్మాణ శాఖను రవాణా, రోడ్ల, భవనాల శాఖలో విలీనం చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్లో కొత్త పథకాలేమీ చేపట్టకపోవడంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ను మూసివేయాలని నిర్ణయించారు. దీంతో గృహనిర్మాణ శాఖకు చెందిన ఆస్తులు, పథకాలు, సిబ్బంది బాధ్యతలను ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్అండ్బీలోనే ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయనున్నారు.
ఆర్అండ్బీ, హౌసింగ్ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం సమీక్ష జరిపారు. ఎర్రమంజిల్లోని ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో 2022-23 బడ్జెట్ ప్రతిపాదనలు, వ్యయంతోపాటు 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. వీటికి తగు మార్పులు చేసి తుది బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపాలని మంత్రి వేముల ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ విజయేంద్రబోయి, ఆర్అండ్బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఈ సతీశ్, మధుసూదన్, గృహనిర్మాణ శాఖ ఎస్ఈ చైతన్యకుమార్ పాల్గొన్నారు.