కామారెడ్డి : మలివిడత తెలంగాణ ఉద్యమం అహింస విధానంలో జరిగిందని, ఉద్యమ నేత కేసిఆర్ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరవీరుల ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.
ప్రతి ఒక్కరు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. 2014 జూన్ 2 కంటే ముందు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, రాష్ట్ర ఏర్పడి 9 ఏళ్లు పూర్తి అయిన తర్వాత పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు వేడుకలు ఏర్పాటుచేసి.. రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారని గంప గోవర్ధన్ చెప్పారు. జిల్లాలో దశాబ్ది వేడుకలకు ప్రజల నుంచి అపూర్వస్పందన లభించిందన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడం గొప్ప విషయమని కొనియాడారు. జెడ్పీ చైర్ పర్సన్ శోభ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం, అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ధైర్య సాహసాలు ప్రదర్శించారని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏర్పాటు చేసిందని చెప్పారు. కాగా సమావేశంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అమరవీరుల సంస్మరణ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 17 మంది అమరవీరుల కుటుంబాలకు ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేసి శాలువాలతో సన్మానించారు.
ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.