హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రకళ శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కోరారు. గురుకుల విద్యార్థుల కోసం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన చిత్రకళ శిక్షణా శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వేసవి శిక్షణ శిబిరాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ గిన్నిస్ రికార్డు గ్రహీత జయంత్రెడ్డి, గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ కార్టూనిస్ట్ శంకర్, 80 మంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు, 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.