యాదాద్రి, సెప్టెంబర్ 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం మరో ఉత్సవానికి సిద్ధమవుతున్నది. స్వామివారు కొండ దిగి తెప్పోత్సవంలో కనువిందు చేయనున్నారు. అందుకోసం కొండకింద గల గండి చెరువు (లక్ష్మీ తటాకం)ను ఆర్అండ్బీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వైటీడీఏ నిధుల నుంచి రూ.33.70 కోట్లు కేటాయించారు. అందులో రూ.20.10 కోట్లతో గండిచెరువు పూడికతీత, రక్షణ గోడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాటితోపాటు సహజ సిద్ధమైన పందిళ్లు, బల్లలు, పాత్వే, సైకిల్ ట్రాక్, చెరువు చుట్టూ 2 నడక దారులు నిర్మించారు. గార్డెనింగ్ ప్రాంతంలో మరో ఫుట్పాత్ నిర్మించారు. భక్తులు కాలినడకను గండి చెరువు చుట్టూ తిరుగుతూ సేద తీరేలా నిర్మాణాలు జరిగాయి. చెరువు చుట్టూ 1000 మీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు నిర్మిస్తున్నారు. పూలు, ఔషధ మొక్కలు, దేవతావృక్షాలు నాటనున్నారు. చెరువు చుట్టూ పంచనారసింహుడి విగ్రహాలను అమర్చారు. చెరువులోకి దిగేందుకు ప్లాట్ఫామ్ నిర్మించనున్నారు. అక్కడే వేడుక కోసం తెప్ప (పడవ)ను ఉంచనున్నారు. ఇప్పటికే గండి చెరువు కాళేశ్వరం నీటితో జలకళను సంతరించుకున్నది. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు లేజర్షోను తలపించేలా ఫౌంటెయిన్లు నిర్మించనున్నారు. చెరువు ప్రవేశ ద్వారం వద్ద మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్ను సిద్ధం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఆర్నమెంటల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. గండి చెరువుకు చేరుకునేందుకు ఇప్పటికే రింగురోడ్డు అందుబాటులోకి వచ్చింది. అనుకున్న సమయానికి పనులు పూర్తయితే వచ్చే కార్తిక మాసంలో తెప్పోత్సవం వైభవంగా జరుగనున్నది.