నిజామాబాద్, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు మరోసారి రైతుల సెగ తగిలింది. పసుపు బోర్డు హామీ నెరవేర్చక తప్పించుకు తిరుగుతున్న ఎంపీని రైతులు వెంటాడుతున్నారు. అడుగడుగునా అడ్డుకుని హామీలపై నిలదీస్తున్నారు. తాజాగా వరి రైతులు వీరికి జత కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుంటే వడ్లు బుక్కిస్తామని హెచ్చరిం చారు. యాసంగి ప్రారంభంలో వరి వేయొద్దని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. అధికారులు సైతం ఇతర పంటలు వేసుకోవాలని అవగాహన కల్పించారు.
ఆ సమయంలో బీజేపీ నేతలు మాత్రం ఇందు కు భిన్నంగా రైతులను రెచ్చగొట్టి వరి సాగు చేయించారు. చేతికొచ్చిన పంటను కొంటామని నాడు ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు పత్తా లేకపోవడంతో కర్షకులు కన్నెర్ర చేశారు. ఆర్మూర్ మండలం చేపూర్కు చెందిన రైతులు మంగళవారం ఉదయం ట్రాక్టర్లో ధాన్యం తీసుకొచ్చి ఆర్మూర్లోని పెర్కిట్లో ఉన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసం ఎదుట పారబోశారు. బీజేపీ నేతలు చెప్తేనే వరి సాగు చేశామంటూ రైతులు ముక్తకంఠంతో చెప్పారు. మోదీ డౌన్ డౌన్.. అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తక్షణమే రైతుల నుంచి వడ్లను సేకరించాలని డిమాండ్ చేశారు. నల్ల జెండాలను ప్రదర్శిస్తూ శాంతియుతంగా ఆందోళన చేశారు. అర్వింద్ ఇంటి వద్ద జరిగిన రైతుల ఆందోళనకు స్థానిక ప్రజానీకం మద్దతు తెలిపింది. బీజేపీ ఎంపీ నివాసాన్ని ఆర్మూర్ కర్షకులు ముట్టడించడంతో బీజేపీ నేతలంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. రైతులపై దాడులు చేయాలంటూ ఎంపీ అర్వింద్ కొంత మంది కిరాయి వ్యక్తులను పంపించారు. రైతుల ఆగ్రహాన్ని చూసి వారంతా తోకముడిచారు.