Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధులగుట్ట శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా శని, ఆదివారాలలో భక్తులు పోటెత్తారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామివారిని దర్శించుకుని భక్తులు పలకించిపోయారు. సర్వ సృష్టికి సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా, భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచుకుంటున్నపరమ శివుని పర్వదినాన సిద్ధులగుట్ట క్షేత్రం దేదీప్యమానంగా వెలుగుతూ భూలోక కైలాస శోభను సంతరించుకున్నది.
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివరాత్రి జాగరణ ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో కలిసి భోజనం చేశారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి వేడుకలను ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ మహారాజ్ దేశప్రజల దైవం మాత్రమే కాదని స్ఫూర్తికి మూలమని అభివర్ణించారు.