హైదరాబాద్ : రిటైల్ మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మూడు వేర్వేరు వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. జీవోలు 87, 98లను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ కే లక్ష్మణ్ వెల్లడించారు. గౌడ్ కులస్తులకు మాత్రమే 15 శాతం మద్యం షాపులను కేటాయించడాన్ని పిటిషనర్ న్యాయవాది పీవీ రమణ తప్పుపట్టారు. గౌడ్ల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయన నివేదికలు లేకుండానే రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలుకు అనుసరించిన విధానం చెప్పాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ గౌడ కులస్తులు కల్లు వ్యాపారం చేస్తుంటారని, అయితే కల్లు చెట్లు తగ్గిపోవడంతో చాలా మంది గౌడ్ కులస్తులు మద్యం వ్యాపారాల్లోకి వస్తున్నందున వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటును పరిగణనలోకి తీసుకుని 15 శాతం మద్యం షాపులు రిజర్వు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయమని, పైగా విధాన నిర్ణయం కాబట్టి ఇందులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని చెప్పారు.
రాజ్యాంగంలోని ఎక్కడా రిజర్వేషన్లు కల్పించకూడదని ఏమీ లేదన్నారు. చట్ట ప్రకారం కూడా ప్రభుత్వం నిర్ణయం సహేతుకమేనని చెప్పారు. మద్యం షాపుల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీవో 87, రిజర్వేషన్ల విధానంపై జీవో 98, జీవో 87లోని అంశాలు కొన్నింటిని సవరిస్తూ ఈ నెల 8వ తేదీన మరో జీవో 100 జారీ అయ్యిందని చెప్పారు. తాజా జీవో 100 ప్రతిని అందజేయాలని న్యాయమూర్తి కోరారు. ప్రస్తుతం అందుబాటులో లేదని, శనివారం ఉదయంలోగా జీవో 100 ప్రతిని అందజేస్తామని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.