ఖమ్మం : తన నిశ్చితార్థానికి 2 గంటల ముందు ఓ యువ కానిస్టేబుల్ ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. సత్తుపల్లి నియోజకవర్గం యజ్ఞనారాయణపురం గ్రామానికి చెందిన అశోక్ కుమార్(29) 2020లో ఏఆర్ కానిస్టేబుల్గా నియామకం అయ్యాడు. తర్వాత కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలో పని చేశాడు. ఇటీవల జరిగిన బదిలీల్లో అశోక్ ములుగు జిల్లాకు బదిలీ అయ్యాడు.
అయితే ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రయివేటు లాడ్జిలో అశోక్ రూమ్ తీసుకున్నాడు. సోమవారం ఉదయం లాడ్జి సిబ్బంది రూమ్ను శుభ్రం చేసేందుకు వచ్చారు. రూమ్ డోర్ ఎంత సేపటికి తీయకపోవడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. లాడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి చూడగా, అశోక్ కుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే అశోక్ కుమార్ నిశ్చితార్థం సొంతూరిలో ఈ మధ్యాహ్నం జరగాల్సి ఉండే. అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.