హైదరాబాద్ జనవరి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో షీటీమ్స్ అమలుతీరుపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రశంసలు కురిపించినట్టు అడిషనల్ డీజీ స్వాతిలక్రా తెలిపారు. ఢిల్లీలో ఈ నెల 5 నుంచి 7 వరకు చీఫ్ సెక్రటరీల రెండో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి స్వాతి లక్రా హాజరై, ‘ఉమెన్ ఎంపవర్మెంట్’ విభాగంలో ఉమెన్ సేఫ్టీపై మాట్లాడారు. తెలంగాణ షీటీమ్స్ను అనుసరించాలని అన్ని రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఆదేశించినట్టు ఆమె చెప్పారు. తెలంగాణ సర్కారు మహిళల రక్షణకు చేపట్టిన కార్యక్రమాలు, షీటీమ్స్లో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు విధానాన్ని వివరించారు. తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమంపై ప్రభుత్వం, పోలీసులు తీసుకొంటున్న చర్యలను, వాటి ఫలితాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రధాని మోదీ ముందు ప్రర్శించినట్టు తెలిపారు. డాక్యుమెంటరీ చూసిన తర్వాత అన్ని రాష్ర్టాల్లోనూ ఇలాంటి చర్యలు పాటించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇతర రాష్ర్టాల ప్రతినిధులను ఆదేశించినట్టు వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్కు తెలంగాణ నుంచి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీలు రామకృష్ణ, అరవింద్కుమార్, సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ పాల్గొన్నారు.
ఉమెన్ సేఫ్టీ వింగ్ బాస్గా శిఖా గోయెల్
పోలీస్ మహిళా భద్రతా విభాగం చీఫ్గా ఏడీజీ శిఖా గోయెల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను స్వాతిలక్రా సమర్థవంతంగా నిర్వహించారు. ఏసీబీ డైరెక్టర్గా ఉన్న శిఖా గోయెల్ భరోసా, షీటీమ్స్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తాజా నియామకంతో ఆమె మహిళా భద్రతా, షీటీమ్స్, భరోసా కేంద్రాల బాధ్యతలను పూర్తిస్థాయిలో చేపట్టనున్నారు.