మేడ్చల్ రూరల్/గజ్వేల్, ఫిబ్రవరి 28: ‘తెలంగాణమే సీఎం కేసీఆర్ బహుత్ బడియా కామ్ కియా’ అంటూ మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన జల్జీవన్ మిషన్ బృందం సభ్యులు ప్రశంసించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జల్జీవన్ మిషన్ అమలు, నిర్వహణ కోసం ఆ రాష్ర్టానికి చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇంజినీర్లతో కూడిన 18 మంది సభ్యుల బృందం మంగళవారం మేడ్చల్ మండలం మునీరాబాద్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలం నర్సన్నపేట గ్రామాల్లో పర్యటించింది. తాగునీటి వ్యవస్థ నిర్వహణ, గ్రామపంచాయతీ నిధుల ఖర్చు వివరాలు తెలుసుకోవడంతోపాటు గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ సంప్హౌజ్ను సందర్శించారు.
నర్సన్నపేటలో ఈఈ గిరిధర్, డీఈఈ సుమలత, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, తాగునీటి నిర్వహణ కమిటీ, గ్రామస్థులతో పంచాయతీ నిధుల నిర్వహణ, తాగునీటి సరఫరా గురించి చర్చించారు. కోమటిబండ సంప్హౌజ్ వద్ద బృందం సభ్యులకు డీఈఈ నాగార్జున మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి, గోదావరి జలాల సేకరణ శుద్ధీకరణ, గ్రావిటీ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా తదితర అంశాల గురించి మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్లో క్షుణ్ణంగా వివరించారు. మిషన్ భగీరథ గురించి తెలుసుకొన్న జల్జీవన్ మిషన్ సభ్యులు సీఎం కేసీఆర్ చాలా అద్భుతం చేశారని కొనియాడారు. ప్రజలకు తాగునీటిని అందించడానికి చాలా గొప్ప పని చేశారని, ప్రభుత్వ ఆశయ సాధనకు ఇక్కడి ఇంజినీర్లు చేసిన కృషి అమోఘమని ప్రశంసించారు. ఇంతగా శ్రమించే ఇంజినీర్లు ఇక్కడ ఉండటం గ్రేట్ అని కొనియాడారు.