Congress | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆదినుంచీ రైతువిరోధిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అన్నంత పనీ చేసింది. ఇప్పటికే 3 గంటల కరెంటే చాలు అని చెప్తున్న హస్తం పార్టీ అన్నదాతలకు రైతుబంధు, రుణమాఫీ అందకుండా అడ్డుపడింది. రైతుబంధు ఆపాలని ఆ పార్టీ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొన్న ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర సర్కారు సమాధానాలు ఇచ్చినా ఈసీ నుంచి సానుకూల ఆదేశాలు రాలేదు. మరోవైపు కాంగ్రెస్కు వత్తాసు పలుకుతూ కేంద్ర సర్కారు పీఎం కిసాన్ సమ్మాన్, డీఏ విడుదల చేసింది. కాగా, ఓట్లవేటలో తమ ప్రయోజనాలకు అడ్డుపడ్డ కాంగ్రెస్పై అన్నదాతలు మండిపడుతున్నారు.
రైతులకు 3 గంటల విద్యుత్తు చాలంటూ రైతు విరోధి అనిపించుకున్న కాంగ్రెస్ నిర్వాకంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు వద్దంటూ, రుణమాఫీ చేయొద్దంటూ ఆ పార్టీ ఎన్నికల సంఘానికి రాసిన లేఖ వల్ల రైతాంగం కష్టాలు పడుతున్నది. కాంగ్రెస్ లేఖను పరిగణనలోకి తీసుకొన్న ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖలోని ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలిచ్చింది. ఇప్పటికే 11 సార్లు రైతుబంధు ఇచ్చామని, ఇది కొనసాగుతున్న పథకమని స్పష్టతనిచ్చింది. అయినా ఈసీ నుంచి సానుకూల ఆదేశాలు అందలేదు. మరోవైపు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ విడుదలపై ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఈసీకి ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.
తాజాగా రైతులు యాసంగి పంట కోసం సిద్ధమయ్యారు. ఏటా ఇస్తున్నట్టుగానే నవంబర్లో రైతు బంధు ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు ప్రభుత్వమిచ్చే పెట్టుబడి సాయం కోసం వేచిచూస్తున్నారు. ఆ డబ్బులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు, ట్రాక్టర్ కిరాయిలకు పనికొస్తుందని ఆశతో ఉన్నారు. కానీ, ఓట్ల వేటలో మునిగిన కాంగ్రెస్ రైతుల ప్రయోజనాలకు అడ్డుపడింది. రైతు రుణమాఫీ అంశం కూడా ఎన్నికల సంఘం వద్ద పెండింగ్లోనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని ఎప్పుడో ప్రకటించిందని, దీనికి సంబంధించి సీక్వెల్గా మాఫీ మొత్తాలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నదని, చివరి వాయిదా మిగిలి ఉన్నదని, అనుమతి ఇస్తే వాటిని కూడా రైతు ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ అధికారులు లేఖ రాశారు. రుణమాఫీ లబ్ధిదారులు కొత్తగా ఎవరూ లేరని, 2020 నాటికే ఉన్న వారికే రుణమాఫీ వర్తిస్తుందని, అన్ని వివరాలతో ఈసీకి తెలియజేసింది. కాంగ్రెస్ రాసిన లేఖలతోనే తాము లబ్ధి పొందటం లేదని రైతులు ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా చాలానే..
రాష్ట్రంలోని అనేక అంశాలపై ఈసీ నుంచి పూర్తిస్థాయిలో అనుమతి రాలేదు. ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్, ఉద్యోగులకు డీఏ విడుదల అంశాలు ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు పెండింగ్ డీఏ (కరువుభత్యం) విడుదలకు ఈసీ అనుమతి కోరుతూ అక్టోబర్ 20న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. టీఎన్జీవో కేంద్రం సంఘం నేతలు సైతం సీఈవోను కలిసి డీఏ విడుదలకు అనుమతివ్వాలని కోరారు. పెండింగ్ డీఏ కావడంతో ఇబ్బందులేం ఉండవని, కొత్తది కాదని వివరణ ఇచ్చారు. ఆర్థిక శాఖ కూడా వివరణ ఇచ్చింది. అయినా దీనికి అనుమతి రాలేదు. ఇక ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు గవర్నర్ ఆమోదం లభించగా, గెజిట్ కూడా జారీ అయ్యింది. అయితే వీరికి చట్టబద్ధంగా అపాయింటెడ్ తేదీని ఖరారుచేయాల్సి ఉన్నది. అంతేకాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరుతో టీఎస్ఆర్టీసీలో కొత్తగా హెచ్వోడీని సృష్టించాల్సి ఉన్నది. దీనికీ ఈసీ రాలేదు. అయితే, ఒకవైపు రాష్ట్రంలో రుణమాఫీ, రైతుబంధుకు అనుమతి రాకపోగా, కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయటం, గతంలో పెండింగ్ డీఏలను సైతం కేంద్రం విడుదల చేయటం గమనార్హం. కేంద్రం ఇచ్చే పథకాల విషయంలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు మెదపలేదు. ఈసీకి ఫిర్యాదు చేయలేదు.