హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర కోర్ కోర్సుల తరహాలోనే కొన్ని ఎమర్జింగ్ కోర్సులకు పలు కాలేజీలు గుడ్బై చెప్తున్నాయి. ఒకే విభాగంలోని అనుబంధ కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో పలు కాలేజీల ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది 140 ఇంజినీరింగ్ కాలేజీలు కోర్సుల విలీనం లేదా సీట్లు పెంచుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి.
ఎమర్జింగ్ కోర్సులుగా పేరొందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలోని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), సైబర్ సెక్యూరిటీ, డాటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ వంటి కోర్సులను వదిలేసి ఆయా సీట్లను సీఎస్ఈలో విలీనం చేస్తున్నాయి. దీంతో పలు కాలేజీల్లో ఆయా కోర్సుల్లో ఫస్టియర్ సీట్లు జీరో కానున్నాయి. ఒక కాలేజీలో సీఎస్ఈ ఐవోటీ కోర్సులో 60, సీఎస్ఈలో 180 సీట్లు ఉన్నాయి. ఆ కాలేజీ ఐవోటీలోని 60 సీట్లను సీఎస్ఈలో విలీనం చేసేందుకు దరఖాస్తు చేసింది. ఇందుకు అనుమతిస్తే సీఎస్ఈలో సీట్లు 240కి పెరుగుతాయి. ఐవోటీలో సీట్లు సున్నా అవుతాయి. మరో కాలేజీ ఐటీ కోర్సులో ఉన్న 90 సీట్లల్లో 60 సీట్లను సీఎస్ఈలో విలీనం చేసేందుకు దరఖాస్తు సమర్పించింది.