TS EAPCET 2024 | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్కు దరఖాస్తులు పోటెత్తాయి. ఎప్సెట్ పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తున్నా యి. మంగళవారం వరకు ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి 2,50,919, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 97,995, రెండింటికి హాజరయ్యే వారు 333 మంది చొప్పున మొత్తంగా 3,49,247 దరఖాస్తులొచ్చాయి. ఆలస్య రుసుంతో మే 1 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశమున్నది.
ఈ నేపథ్యంలో దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నది. దీంతో అటు సెంటర్లలో ఖాళీలు లేక, ఇటు భారీగా దరఖాస్తుల వస్తుండటంతో జేఎన్టీయూ అధికారులు కొత్త సెంటర్ల వేటలో నిమగ్నమయ్యారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని ల్యాబ్ గదుల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా సెంటర్లు కేటాయించేందుకు వీలున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల వివరాలను తెప్పించుకుంటున్నారు. అన్నీ సవ్యంగా ఉంటే ఆయా కాలేజీల్లో కొత్త సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.