హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన అప్పీల్ పిటిషన్ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ కే పద్మ సహా 20 మంది దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై హైకోర్టు రిజిస్ట్రీ ప్రాథమిక దశలోనే అభ్యంతరం చెప్పింది. ఈ అభ్యంతరంపై న్యాయమూర్తులు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది.
భూదాన్ భూములపై రాష్ట్ర ప్రబుత్వానికి అధికారం ఉండదని, దీనిని సింగిల్ జడ్జి పట్టించుకోలేదని, వెయ్యి ఇండ్లను అన్యాయంగా కూల్చేశారని, వాళ్లలో 300 మందికిపైగా పట్టాలు మంజూరు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అర్హులైనవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని తెలిపారు. వాదనల తర్వాత డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబేనని తేల్చింది.