హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): యాప్ ఆధారంగా మన ఇంటిదగ్గరకే అన్ని సమకూర్చే గిగివర్కర్స్ బతుకులు త్రిశంకు స్వర్గంలా మారాయి. యాప్ ఆధారిత కంపెనీల అత్తెసరు కమీషన్లు, వేతనాలు చెల్లిస్తుండడంతో కుటుంబపోషణకు అధికగంటలు పనిచేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యాల బారినపడుతున్నారు. ఇటు కంపెనీలు పట్టించుకోక, మరోవైపు కార్మిక చట్టాలు వర్తించక ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చితికిపోతున్నారు.
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ ఆధారిత ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ), ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) ఓలా, ఉబెర్ తదితర యాప్ ఆధారిత డ్రైవర్ల పని పరిస్థితులు, జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ బేస్డ్ యాప్లకు సేవలందిస్తున్న డెలివరీ బాయ్స్పై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) హైదరాబాద్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ ఇటీవల కాలంలో వేర్వేరుగా నిర్వహించిన సర్వేలు ఈ చేదు నిజాన్ని స్పష్టం చేశాయి. దేశంలో మొత్తంగా 2 కోట్ల మందికి పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్టు తేలింది. ఈ శ్రమ్ పోర్టల్లో 75 లక్షలకుపైగా తమ పేర్లను నమోదు చేసుకొన్నట్టు ఇటీవల కేంద్రమే పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ఇక తెలంగాణలో దాదాపు 4 లక్షల మంది గిగ్వర్కర్స్ ఉన్నారని తెలిపింది.
యాప్ ఆధారిత వర్కర్ కమ్యూనిటీ కార్మిక చట్టాలకు దూరంగా కాలం వెళ్లదీస్తున్నదని సర్వేల్లో తేలింది. ప్రైవేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలపైనే వేలాది మంది డ్రైవర్లు, డెలివరీ కార్మికులు జీవితాలను సాగిస్తున్నారు. తమకు సామాజిక భద్రత కల్పించాలని ఐఎఫ్ఏటీ, ఐటీఎఫ్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ దాదాపుగా దశాబ్దకాలంగా పోరాటం చేస్తున్నాయి. గిగ్వర్కర్స్ ఒత్తిడి, తెలంగాణ సర్కారు డిమాండ్తో కేంద్రం ఎట్టకేలకు 2020లో సోషల్ సెక్యూరిటీ కోడ్ పేరిట ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అందులోనూ అనేక ఆంక్షలు విధించింది. గిగ్వర్కర్స్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు, గిగ్ వర్కర్స్ యూనియన్లతో కలిపి ట్రైపాడ్ బోర్డును ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించింది. గిగ్ వర్కర్ల సేవలను వినియోగించుకొనే కంపెనీలు తమ వార్షిక టర్నోవర్లో 1-2 శాతం, లేదంటే కార్మికులకు పంపిణీ చేసిన వేతనంలో 5 శాతం ఏది తక్కువైతే అది గిగ్వర్కర్ల సామాజిక భద్రతా నిధికి కేటాయించాలని ప్రతిపాదించింది. వివిధ సంక్షేమ పథకాలను రూపొందించాలని సూచించింది. అయితే, మూడేండ్లయినా ఈ చట్టాన్ని కేంద్రం అమలు చేయకుండా చోద్యం చూస్తున్నది.
అన్నిరంగాల్లోకి ఆన్లైన్ సర్వీసులు విస్తరిస్తున్నాయి. అదే సమయంలో దేశంలో గిగ్ ఎకానామీ పెరుగుతున్నది. గిగ్ ఎకానమీ గురించి గొప్పగా చెప్పుకొంటూ ప్రచారం చేసుకొంటున్న కేంద్ర ప్రభుత్వం అందుకు మూలస్థంభాలుగా నిలుస్తున్న గిగ్వర్కర్స్ను మాత్రం పట్టించుకోవడం లేదు. సోషల్ సెక్యూరిటీ కోడ్ చట్టం చేసి మూడేండ్లు అవుతున్నా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. ఇప్పటికైనా ఆ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి.
– షేక్ సలావుద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్