హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుపై సభను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి మన్సుక్ మాండవీయ బీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావుకు క్షమాపణ చెప్పారు. తాను పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యను సరిదిద్దుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రి నామా నాగేశ్వరరావుకు ఒక లేఖ రాశారు. హైదరాబాద్లో బల్క్ డ్రగ్స్ పార్క్ను ఏర్పాటు చేయటంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని నామా ఈ నెల 16న లోక్సభలో విమర్శించారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందజేసిన హైదరాబాద్లో బల్క్ డ్రగ్స్ పార్క్ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి కేంద్రం మాట తప్పిందని తూర్పారబట్టారు. దీనిపై స్పందించిన మన్సుక్ మాండవీయ.. బల్క్ డ్రగ్స్ పార్క్ల కోసం కేంద్రం రూ.1000 కోట్లు కేటాయించిందని, తొలి దశలో గుజరాత్, హిమాచల్ప్రదేశ్తోపాటు హైదరాబాద్కు రూ. 300 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇది పచ్చి అబద్ధమని నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిపై సభా హక్కుల నోటీసు ఇస్తామని హెచ్చరించారు. దీంతో కంగుతిన్న కేంద్ర మంత్రి నిజానిజాలు తెలుసుకొని నామా నాగేశ్వరరావుకు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా తన మంత్రిత్వశాఖ కార్యదర్శి ద్వారా డిసెంబర్ 16న సభలో మంత్రి చేసిన వ్యాఖ్యల్ని సరిదిద్దుకుంటున్నామని గురువారం లిఖిత పూర్వక సమాధానం కూడా ఇచ్చారు.