హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే న్యాయపరంగా ముందుకువెళ్తానని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఎవరికో మేలు చేయటానికి తనపై ఆరోపణలు చేశారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి బహిరంగలేఖ రాసిన నిరంజన్రెడ్డి.. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తుంటే ఖండించకపోవటం విచారకరమని అన్నారు. ‘నా సొంత మండలం పాన్గల్ సమీపంలో ఉన్న భూములకు సంబంధించిన వివరాలను 2018 ఎన్నికల అఫిడవిట్లోనే పేర్కొన్నా. ఈ వివరాలన్నీ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. అక్కడ నా పేరుపై 30 ఎకరాలు, నా భార్య పేరుపై 10 ఎకరాల భూమి ఉంది. ఇందులో 15 ఏండ్లుగా మామిడితోటను నిర్వహిస్తున్నాం. డాక్టరైన నా కూతురు అక్కడి ప్రజలకు ఉచితంగా సేవలు అందించడానికి నా భార్య సొంత నిధులు, బ్యాంకు రుణంతో దవాఖానను నిర్మించాం. గోశాల నిర్వహించేందుకు రెండేండ్ల కిందటే 2.5 ఎకరాలు కొనుగోలు చేశా. మొత్తంగా మాకు 50 ఎకరాల లోపే భూమి ఉంది’ అని వివరించారు. కానీ, 200 ఎకరాలు ఉన్నట్టు ఆరోపించడం తన ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అవుతుందని అన్నారు.