హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగ దంపతులను ఒకే జిల్లాకు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమయ్యింది. స్పౌజ్ కోటాలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. రివర్స్ స్పౌజ్ బదిలీల ద్వారా దంపతులను ఒక దగ్గరికి చేర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే అవకాశమున్నా పలువురు ఉద్యోగులు రివర్స్ స్పౌజ్ పట్ల అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. అధికారులు ఫోన్లు చేసి రివర్స్ స్పౌజ్కు సుముఖంగా ఉన్నారా అని అడిగినా సిద్ధంగా లేమని ఉద్యోగులు కరాఖండిగా చెప్పేస్తున్నారు. నిజామాబాద్ జిలా కు స్పౌజ్కోటాలో దరఖాస్తు చేసిన ఉద్యోగిని, నిజామాబాద్కు బదులు కామారెడ్డి జిల్లాకు వెళ్తారా అంటే అంగీకరించలేదని తెలిసింది. ఆ ఉద్యోగి నుంచి రివర్స్ స్పౌజ్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ డిక్లరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
ఉద్యోగులు కేటాయింపులో భాగంగా స్పౌజ్కోటా బదిలీలకు ప్రభుత్వం గతంలోనే గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పలురకాల సమస్యలతో 5,130 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికులు కొన్ని జిల్లాలనే ఎంపిక చేసుకోవడం, ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆయా దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. భార్యభర్తల్లో ఎవరో ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుంటే వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. కొన్ని జిల్లాల్లో వచ్చేవారు ఎక్కువగా ఉండి ఆయా జిల్లాల నుంచి బయటికి వెళ్లేవారు తక్కువగా ఉండటంతో అక్కడ స్పౌజ్కోటా బదిలీలను నిలిపివేశారు. తాజా ఆదేశాలతో దరఖాస్తులను పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. అన్ని జిల్లాలు కాకుండా అవకాశం ఉన్న జిల్లాలకే బదిలీలు చేయనున్నారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోని ఉద్యోగి కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న తన భర్త లేదా భార్య దగ్గరికి వెళ్లేందుకు దరఖాస్తు సమర్పించారు. అయితే కరీంనగర్ జిల్లాలో ఖాళీలు లేకపోవడంతో ఈ దరఖాస్తును పెండింగ్లో ఉంచారు. రివర్స్పౌజ్ బదిలీ ద్వారా కరీంనగర్లోని ఉద్యోగినే సిద్దిపేట జిల్లాకు బదిలీచేస్తారు. అందుకు ఉద్యోగులు అంగీకారం కోసం ఫోన్లు చేస్తున్నారు.