హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అపార్ట్మెంట్, హైరైజ్ కల్చర్ పెరుగుతున్నది. సొంత ఇంటి కల కంటే పిల్లల స్కూలుకు, పనిచేస్తున్న సంస్థ కార్యాలయానికి దగ్గరగా ఉండాలన్న ఆలోచన జనం మదిలో మొలకెత్తుతున్నది. ఈ కారణంతో వారు అపార్ట్మెంట్ల వైపు చూస్తుండటంతో నగరాల్లో హైరైజ్ వర్టికల్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హైరైజ్ భవనాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ పెరగడంతో బిల్డర్లు కూడా ఆ వైపుగా దృష్టిసారిస్తున్నారు. కొత్త నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున అనుమతులు తీసుకొంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ హైరైజ్ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో సగటున రోజూ ఏడు భారీ భవనాల నిర్మాణాలకు దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం నవంబర్ 2020లో టీఎస్బీపాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐదు, అంతకుమించిన అంతస్థుల్లో భవనాల నిర్మాణానికి 9,672 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సగానికిపైగా భవనాలు అనమతులు పొంది నిర్మాణాలు కూడా పూర్తిచేసుకున్నాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన అనేక కార్యక్రమాలతో ప్రజల తలసరి ఆదాయంతోపాటు కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగింది. మంత్రి కేటీఆర్ కృషితో రాష్ర్టానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివస్తున్నాయి. వాటితోపాటే ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతుండటంతో ఆఫీస్ స్పేస్, నివాస భవనాలకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు హైదరాబాద్లోనే ఇలాంటి పరిస్థితి కనిపించగా ఇప్పుడు ద్వితీయశ్రేణి పట్టణాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పట్టణాల్లోనూ భారీ భవనాలు వెలస్తున్నాయి. మున్ముందు వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు.
కేసీఆర్ ముందుచూపుతోనే..
వందేండ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరాన్ని విస్తరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు ప్రణాళిక సత్ఫలితాలనిస్తున్నది. దాని ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇటీవల కోకాపేటలోని నియోపొలిస్ లేఅవుట్లోని ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ. 100.75 కోట్లు పలికింది. ఆ తర్వాత బుద్వేల్లోనూ భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. అక్కడ 14 ప్లాట్లకు రూ.3,625.73 కోట్ల ధర పలికింది. రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్న డిమాండ్కు ఈ ధరలు అద్దం పడుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశంలోని కొన్ని నగరాలు కోలుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే హైదరాబాద్ మాత్రం శరవేగంగా పరుగులు తీస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపే ఇందుకు కారణమన్నది నిపుణుల మాట. తాత్కాలిక అవసరాలు తీర్చడంతోపాటు నగర ప్రజలకు దశాబ్దాలపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో సవాళ్లను ఎదుర్కొని మరీ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రోడ్డు, మెట్రో నెట్వర్క్ను విస్తరిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమోఘమని, ప్రస్తుతం ప్రభుత్వం రైట్ ట్రాక్లో వెళ్తున్నదని దాదాపు రెండు దశాబ్దాలుగా రియల్ రంగంలో ఉన్న ఓ డెవలపర్ తెలిపారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు నగరంలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా ప్రపంచపటంలో హైదరాబాద్ గ్రాఫ్ పెరుగుతున్నదని వివరించారు.
రియల్రంగంలో ఊహించని పెరుగుదలహైదరాబాద్ రియల్ రంగంలో ఊహించని పెరగుదల కనిపించినట్టు ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ సంస్థ నివేదిక పేర్కొంది. నిరుడు జూలైతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో ఆస్తుల రిజిస్ట్రేషన్ 26 శాతం పెరిగినట్టు తెలిపింది. దేశంలోని టాప్-7 నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో విలాసవంతమైన నివాసాల ధర సగటున 42 శాతం ఎగబాకినట్టు అనరాక్ ఎనాలసిస్ పేర్కొంది. ఇండియాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రకారం.. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య రెసిడెన్షియల్ సెక్టార్లో హైదరాబాద్లో గణనీయమైన వృద్ధి కనిపించింది.
టీఎస్బీపాస్ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నవి (ఐదు అంతస్థులు, ఆపైన)
జిల్లా నిర్మాణాల సంఖ్య
రంగారెడ్డి 3,815
మేడ్చల్ 3,387
హైదరాబాద్ 747
సంగారెడ్డి 679
హన్మకొండ 276
ఖమ్మం 195
కరీంనగర్ 104