హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని తెలుగు యువతి మృతిచెందింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల (23) ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లింది. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో డెక్సర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో జాహ్నవి నడుచుకొంటూ వెళ్తుండగా, పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన జాహ్నవిని సీయెట్లోని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సమాచారాన్ని జాహ్నవి స్నేహితులు మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.