హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం గుంటూరులో ప్రారంభించనున్నట్టు ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదంతస్థుల భవనంలో కార్యాలయం ఏర్పాటు చేశామని, ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నదని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ, పార్టీ నిర్మాణం, కార్యాచరణ తదితర అంశాలు ఈ కార్యాలయం నుంచే చేపడతామని వివరించారు. టీడీపీ, వైసీపీ, బీజేపీతో ఏపీ ప్రజలు విసిగిపోయారని, ఏపీ ప్రజానీకానికి బీఆర్ఎస్ ఆశాదీపంలా మారిందని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు.