హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్ణయంలో తప్పులేదని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం సరైన సమయంలో సరైన ప్రకటన చేసిందని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా, న్యాయబద్ధ్దంగా రావాల్సిన గ్లాసు నీటిని కూడా వదులుకోబోమని పేర్కొన్నారు. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదని, చంద్రబాబు హయాంలోనే దానిని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేంద్రం గెజిట్ విడుదలచేయడం శుభపరిణామమని, ఇరు రాష్ర్టాల మధ్య సయోధ్యకు దోహదపడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.