హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఏపీ సర్కారు తెచ్చిన జీవో నెంబరు 1పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు కొనసాగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. సోమవారం వరకు జీవో నెంబరు 1ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే జీవోపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ముగ్గురు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం జీవో నెంబర్ 1 తెచ్చిందని వారు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.