హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్ఠానం మరో షాక్ ఇచ్చింది. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనవద్దని సమాచారం పంపించింది. ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిది.. ధన్యవాదాలు.. అంటూ జీఎస్డబ్ల్యూఎస్ కమిషనర్ పేరుతో ఎమ్మెల్యే ఆనంకు మెసేజ్ వచ్చింది.
జిల్లాలోనే సీనియర్ అయినా తనకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తగిన ప్రాధాన్యం లేదని ఆయన తొలి నుంచీ అసంతృప్తిగానే ఉంటున్నారు. ఇప్పుడు గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనవద్దని మెసేజ్ రావడం ఆనం వర్గాన్ని తీవ్ర అసంతృప్తికి లోను చేసింది. ఇప్పటికే ఆనంను నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానంలో రామ్కుమార్రెడ్డిని సమన్వయకర్తగా పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ పరిణామాలతో ఆనంకు వైసీపీతో బంధం తెగిపోయినట్టేనని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.